హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : బయోటెక్నాలజీ దిగ్గజం ‘ఆమ్జెన్’…జెనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిషరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఆమ్జెన్ ఇండియా ఎండీ నవీన్ గుళ్లపల్లి, రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్యలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పరిశోధన కేంద్రంలో స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఆమ్జెన్ ఇటీవల 3 వేల మంది ఉద్యోగులతో అతి పెద్ద జీసీసీని ఇక్కడే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉద్యోగ అవకాశాల్లో ఇకడి యువతకు ప్రాధాన్యతనిచ్చి నియామకాలు జరుపాలని కంపెనీ యాజమాన్యానికి ఆయన సూచించారు. ఆమ్జెన్.. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల ఆరోగ్యం, ఇన్ఫ్లమేషన్, శ్వాసకోశ, తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు.