న్యూఢిల్లీ: స్పైస్ జెట్ ( Spicejet ) విమానయాన సంస్థ సెప్టెంబర్ 15 నుంచి 25 మధ్య మొత్తం 38 విమానాల రాకపోకలను పునఃప్రారంభించనుంది. ఈ మేరకు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ బుధవారం ఒక ప్రకటన చేసింది. ఢిల్లీ-సూరత్-ఢిల్లీ, బెంగళూరు-వారణాసి-బెంగళూరు, ముంబై-జైపూర్-ముంబై, ముంబై-ఝర్సుగూడ-ముంబై, చెన్నై-వారణాసి-చెన్నై మధ్య డొమెస్టిక్ సర్వీసులు నడుస్తాయని తన ప్రకటనలో పేర్కొన్నది.
ఇక అంతర్జాతీయ విమానాలు భారత్ నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి భారత్కు నడుస్తాయని తెలిపారు. భారత్లోని ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చి, కోజికోడ్, అమృత్సర్, మంగళూరు నుంచి దుబాయ్కి విమానాలు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. రాబోయే 10 రోజుల్లో 38 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నామని ప్రకటించడం తమకు ఎంతో సంతోషంగా ఉన్నదని స్పైస్ జెట్ చైర్మన్ అజయ్సింగ్ చెప్పారు.