Haryana BJP Govt Crisis | లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాదు ముగ్గురు ఎమ్మెల్యేలు సోంబీర్ సాంగ్వ్, రణ్ దీర్ గోలెన్, ధరంపాల్ గోండార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా, హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో ముగ్గురు ఎమ్మెల్యేలు రోహతక్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
హర్యానా అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 90. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్లు సాధించడంలో బీజేపీ విఫలమైంది. ప్రస్తుతం అసెంబ్లీలో 88 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీ బలం 40 మంది. ఇంతకుముందు జేజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు. కానీ జేజేపీతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ సర్కార్ మైనారిటీలో పడినట్లు తెలుస్తున్నది.
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46. రాష్ట్ర అసెంబ్లీలోని 90 స్థానాల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే 45 మంది సభ్యుల మద్దతు ఉంటే ప్రభుత్వానికి ఢోకా లేదు. 40 మంది సొంత ఎమ్మెల్యేలతోపాటు హర్యానా లోక్ హిత్ పార్టీ (గోపాల్ కండా) ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో బీజేపీకి 43 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు కనిపిస్తున్నది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, 10 మంది జేజేపీ ఎమ్మెల్యేలు, ఐఎన్ఎల్డీ నుంచి ఒక ఎమ్మెల్యేతో కలుపుకుంటే 44 మంది మద్దతు ఉంది. మరో స్వతంత్ర ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. దీంతో హర్యానాలోని బీజేపీ సర్కార్ మైనారిటీలో పడిపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.