Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం అమావాస్య ఘడియలు రావడంతో లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించింది. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో శ్రీ బయలు వీరభద్రస్వామి వారికి శ్రీశైల దేవస్థానం వేద పండితులు, అర్చకులు విశేష పూజలు జరిపిస్తున్నారు. అమావాస్య నాడు భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చన జరిపించుకునే అవకాశం కల్పించారు. మంగళవారం 21 మంది భక్తులు పరోక్ష సేవ ద్వారా శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు జరిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులు కూడా ఈ పూజలు జరిపిస్తున్నారు. ఈ పూజాధికాల కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించేందుకు ముందుగా మహాగణపతి పూజ జరిపించారు.
ఈ పూజాధికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో వీరభద్ర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ స్వామి ఆరాదనతో గ్రహ దోషాలు నివారిస్తారని, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, ఎంత క్లిష్ట సమస్యలైనా పరిష్కారం అవుతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వ కార్యానుకూలత లభిస్తుందని, ప్రజల అభీష్టం సిద్ధిస్తుందని పండితులు పేర్కొన్నారు.
ఈ పరోక్ష సేవ కోసం ఆన్ లైన్ ద్వారా భక్తులు రూ.1,116 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటది. భక్తులు సేవా రుసుము www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లించాలి. కాగా, ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రాసారాన్ని వీక్సించేందుకు వీలుగా సేవాకర్తలకు ప్రసార వివరాలు, ప్రసారాల సమయం తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని శ్రీశైలం ఈఓ డీ పెద్ది రాజు చెప్పారు. సేవా కర్తలతోపాటు భక్తులు కూడా శ్రీశైల టీవీ/ యూ-ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. కనుక భక్తులందరు కూడా ఈ పరోక్ష సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 8333901351 / 52 / 53 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చునని తెలిపారు.