KTR | తెలంగాణ కోసం పేగులు తెగే దాకా కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు ఉంటే.. కుర్ కురే బీజేపీ పార్టీ ఒక దిక్కు, కిరికిరి కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కుర్కురే పార్టీకి, కిరికిరి పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అంబర్పేటలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జూన్ 2 తర్వాత బీజేపోళ్లు కచ్చితంగా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం మార్చేస్తారని అన్నారు. హైదరాబాద్ మీద వాళ్లకు పట్టుదొరకట్లేదని.. అందుకే ఢిల్లీని చేసినట్లు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్లో కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇవి ప్రధాని ఎన్నికలు కదా? బీఆర్ఎస్ గెలుసుడు ఏమీ అవసరమని కొందరంటున్నారని తెలిపారు. గతంలో కూడా ఇట్లనే మాట్లాడారని. కానీ ఐదుగురు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తెచ్చారని గుర్తుచేశారు. ఢిల్లీ మెడలు, కాంగ్రెస్ మెడలు వంచేది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
ఐదేళ్లలో కిషన్ రెడ్డి అంబర్పేటకు ఒక్క రూపాయి అయినా తెచ్చిండా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క గుడి కట్టిండా, బడి కట్టిండా? ఆయనకు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. ఈ సారి బీజేపీ 400 సీట్లు అంటోంది. మళ్లీ బీజేపీకి ఓటు వేస్తే పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 400 అవుతుందని.. సిలిండర్ ధరను ఐదు వేలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. మీకు ఓటు ఎందుకు వేయాలని అడిగితే మేము గుడికట్టినం అని అంటున్నారని..మరి కేసీఆర్ యాదాద్రి కట్టలేదా అని ప్రశ్నించారు. ఒక్క యాదాద్రి మాత్రమే కాదు.. ఆధునిక దేవాలయాలైన కాళేశ్వరం సహా ఎన్నో రిజర్వాయర్లు కట్టిండని తెలిపారు. గుడి కట్టుడే కారణమైతే కేసీఆర్కు ఎన్ని ఓట్లు వేయాలని ప్రశ్నించారు. సికింద్రాబాద్లో బీజేపోళ్లే కిషన్ రెడ్డి హటావో.. సికింద్రాబాద్ బచావో అంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఇక్కడ 2014, 2018 లో బీజేపోళ్లను ఓడించింది బీఆర్ఎస్సే అని గుర్తుచేశారు. బీజేపీ తీస్ మార్ ఖాన్లు అని చెప్పుకునేటోళ్లను కూడా 2023లో బీఆర్ఎస్సే ఓడించిందని తెలిపారు.
కాంగ్రెసోళ్లు సిగ్గులేకుండా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మా చెల్లెలు, కేసీఆర్ కుమార్తె 50 రోజులుగా జైల్లో ఉంది.. బీజేపీతో మాకు దోస్తీ ఉంటే మా చెల్లెలు జైల్లో ఉండేదా? అని అడిగారు. 2014 లో బడేభాయ్.. 2023 లో చోటా భాయ్ మోసం చేసిండని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నమ్మి మోసపోయారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలైనయ్ అంటూ రేవంత్ రెడ్డి హోర్డింగ్లు పెట్టుకున్నాడని మండిపడ్డారు. ఆడబిడ్డలకు లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నావ్.. ఇయ్యకపోతే నీ లగ్గం చేస్తారని మండిపడ్డారు.
మహిళలకు రూ. 2500 చొప్పున ఇచ్చామని రాహుల్ గాంధీ చెబుతున్నాడని.. మరి వచ్చినయా అని కేటీఆర్ ప్రశ్నించారు. వృద్ధులకు రూ. 4 వేలు అన్నాడు.. ఉన్న 2 వేలు కూడా ఎగగొట్టిండని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే టీవీల ముందు ఫ్యామిలీతో చూసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. నేను లంకెబిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అంటాడు. దొంగలు కదా లంకెబిందెల కోసం తిరిగేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడని.. పేగులను మెడల వేసుకుంటా అంటున్నాడని.. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జేబులా కత్తెర పెట్టుకొని తిరుగుతాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లు మే 13న కారు గుర్తు మీద ఓటు వేయాలని కేటీఆర్ సూచించారు. 10-12 సీట్లను బీఆర్ఎస్కు అప్పగిస్తే.. ఆరు నెలల్లోనే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో మనమే గెలుస్తున్నామని పేర్కొన్నారు. అంబర్పేటలో పజ్జన్నకు 50 వేల మెజార్టీ రావాలని కోరారు. 24 ఏళ్లుగా కేసీఆర్తో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న పజ్జన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.