Polling | సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశలో 11 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. జమ్ముకశ్మీర్ లోని అనంత నాగ్-రాజౌరీ స్థానానికి ఈ నెల 25న పోలింగ్ జరుగనున్నది. మంగళవారం జరిగిన పోలింగ్ లో ప్రధాని నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు అందిన సమాచారం మేరకు 61.45 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
మంగళవారం పోలింగ్తో మొత్తం 543 లోక్ సభ స్థానాల్లో సగం స్థానాలకు పోలింగ్ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం, మిగతా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో సూరత్ లోక్ సభా స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో దశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలన్నీ బీజేపీకి కంచుకోటలుగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 92 స్థానాలకు బీజేపీ 72 స్థానాల్లో విజయం సాధించింది. వాటిల్లో కేవలం గుజరాత్ నుంచే 26 స్థానాలు ఉన్నాయి.
మూడో దశ పోలింగ్ లో అసోం నాలుగు, బీహార్ ఐదు, ఛత్తీస్ గఢ్ ఏడు, గోవా రెండు, గుజరాత్ 25, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ ఎనిమిది, మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్ 10, పశ్చిమ బెంగాల్ నాలుగు, దాద్రా అండ్ నగర్ హవేలీ ఒకటి, డామన్ డయ్యూ ఒక స్థానంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గాంధీ నగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుణ నుంచి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటకలోని ధర్వాడ్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మధ్యప్రదేశ్ లోని విదిశ నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీలో ఉన్న ప్రముఖులు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిలో ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్, పశ్చిమ బెంగాల్ లోని బర్హంపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్, మహారాష్ట్రలోని బారామతి నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే, అసోంలోని ధుబ్రీ నుంచి ఏఐడీయూఎఫ్ అభ్యర్థి బద్రుద్దీన్ అజ్మల్ భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు.