Nayab Singh Saini | ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణతో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ నిగూఢ వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వానికి ముప్పు లేదన్నట్లు వ్యాఖ్యానించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆకాంక్షలు నెరవేరుస్తుందని భావిస్తున్నా, ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయని నయాబ్ సింగ్ సైనీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘కానీ ప్రజలకు అందరికి తెలుసు. తమ ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. కానీ, వారి వ్యక్తిగత ఆకాంక్షలు మాత్రమే నెరవేరుస్తారు’ అని చెప్పారు. కొత్తగా తనకు తలెత్తిన ముప్పును ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహాన్ని ఆయన బయట పెట్టలేదు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా మీడియాతో మాట్లాడుతూ ‘మైనారిటీలో పడిన హర్యానా ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. వారికి ధన్యవాదాలు’ అని చెప్పారు.
రోహతక్ లో భూపీందర్ సింగ్ హుడా, హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్ ధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ మీడియాతో మాట్లాడుతూ.. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.