భోపాల్: స్కూల్లో జరుగుతున్న పరీక్షలు రాసేందుకు విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్ ప్రాంగణంలో ఉన్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించాడు. (Boy Killed In Bee Attack) మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోయత్కళలోని స్వామి వివేకానంద పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నాయి.
కాగా, శుక్రవారం పరీక్షలు రాసేందుకు విద్యార్థులు స్కూల్కు చేరుకున్నారు. స్కూల్ ప్రాంగణంలో వారు ఉండగా అక్కడున్న తేనెపట్టుల్లోని తేనెటీగలు వారిపై దాడిచేశాయి. కొందరు పిల్లలను అవి కుట్టాయి. 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల రామన్ కరాడాతో పాటు మరి కొందరు విద్యార్థులు గాయపడ్డారు.
మరోవైపు టీచర్లు వెంటనే స్పందించారు. ఆ తేనెటీగల దాడి నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి రామన్ ఆరోగ్య పరిస్థితి వేగంగా విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం రాజస్థాన్లోని ఝలావార్ ఆసుపత్రికి అతడిని తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆ బాలుడు మరణించినట్లు ప్రకటించారు.
కాగా, ఆ స్కూల్ ప్రాంగణంలో పలు తేనెపట్టులు ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Also Read:
Woman killed in PG | పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో మహిళ హత్య.. బెడ్ బాక్స్లో మృతదేహం
boat capsizes in Vrindavan | యమునా నదిలో పడవ బోల్తా.. పది మంది మృతి, పలువురు గల్లంతు
coercion at Nashik firm | ఎంఎన్సీ కంపెనీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. ఆరుగురు అరెస్ట్