Ram Temple | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువైన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సాధారణ భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తొలి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) అందించారు.
సాధారణ భక్తులకు అనుమతించిన తొలిరోజు రామ మందిరానికి రూ.3 కోట్లకు పైనే విరాళాలు అందినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఆలయంలో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కౌంటర్లు, ఆన్లైన్ ద్వారా భక్తులు మొత్తం రూ.3.17 కోట్లు విరాళంగా అందించినట్లు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా వెల్లడించారు.
మరోవైపు అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తొలిరోజు 5 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నారు. రెండో రోజు బుధవారం సైతం 3 లక్షల మంది మూలవిరాట్ను దర్శించుకున్నారు. పటిష్ట భద్రత మధ్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ మంత్రులు ప్రస్తుతం దర్శనానికి వెళ్లొద్దని ప్రధాని మోదీ సూచించారు. ప్రొటోకాల్స్ దృష్ట్యా సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగుతుందని, ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు ఫిబ్రవరిలో బాలరాముడి దర్శనానికి వెళ్లొద్దని తెలిపారు. మార్చిలో తమ పర్యటనకు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన వేళలను పొడిగిస్తూ రామ తీర్థ్ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 7 గంటల వరకే ఉన్న దర్శన సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. కాగా, దర్శనానికి 10-15 రోజుల తర్వాతే రావాలని అధికారులు భక్తులను కోరుతున్నారు. మరోవైపు రద్దీని తగ్గించేందుకు అయోధ్యకు బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు.
Also Read..
Rahul Gandhi | అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ
Australia | ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి
Golden Tiger | అరుదైన గోల్డెన్ టైగర్ ఫొటో షేర్ చేసిన అస్సాం సీఎం.. పిక్ వైరల్