Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిర్వహించిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ సహా ఇతర నేతలపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును సీఐడీ (CID)కి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు కోసం కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర డీజీ తాజాగా వెల్లడించారు.
కాగా, ప్రస్తుతం రాహుల్ యాత్ర అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గువాహటి (Guwahati)లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్ర చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బైపాస్ నుంచి వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాటిని తోసుకుని ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కొందరు పోలీసులపై చేయి చేసుకున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు.
ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీస్ సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు’ అని బిశ్వశర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యాత్ర పేరుతో అస్సాంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్ ఉద్దేశమని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని సీఎం పేర్కొన్నారు.
మరోవైపు సీఎం ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతల చర్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశామని గువాహటి పోలీస్ కమిషనర్ దిగంత బోరా చెప్పారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ను నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిర్వహించవద్దని ఆదేశించినా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని, నిర్దేశిత మార్గాన్ని వదిలేసి నగరంలోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని, నాయకుల తీరుతో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై దాడికి పాల్పడ్డారని, అందుకే వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కాంగ్రెస్ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారన్నారు.
Also Read..
Australia | ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి
Golden Tiger | అరుదైన గోల్డెన్ టైగర్ ఫొటో షేర్ చేసిన అస్సాం సీఎం.. పిక్ వైరల్
Gold Mine | మాలీలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది మృతి