చండీగఢ్: ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు మంత్రి కారణమంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వివాదం నేపథ్యంలో ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. (Punjab Minister resigned) ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పంజాబ్లో ఈ సంఘటన జరిగింది. అమృత్సర్లోని వేర్హౌస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ గగన్దీప్ సింగ్ రంధావా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు. తాను విషపదార్థం తీసుకున్నానని తెలిపాడు. రవాణా శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లర్ పేరు ప్రస్తావించాడు. మంత్రి సహాయకుడికి టెండర్ ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని, దానికి బదులుగా తాను సరైన బిడ్డర్ను ఎంచుకున్నానని అతను ఆరోపించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, పంజాబ్లోని ప్రతిపక్ష పార్టీలు అధికార ఆప్ ప్రభుత్వంపై మండిపడ్డాయి. పది లక్షల లంచం తీసుకునేలా గగన్దీప్ సింగ్ రంధావాను బలవంతం చేశారని శిరోమణి అకాలీ దళ్ సీనియర్ నేత బిక్రమ్ సింగ్ మజీతియా ఆరోపించారు. ఆ అధికారిని మంత్రి ఇంటికి పిలిపించి కొట్టారని, వీడియో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు.
మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లర్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధాలు అని ఆయన అన్నారు. ‘మా పార్టీ ఎల్లప్పుడూ సత్యాన్ని సమర్థిస్తుంది. సత్యం పక్షాన నిలుస్తుంది. అందుకే నాపై వచ్చిన ఆ ఆరోపణలపై విచారణ జరుగాలని నేను కోరుకుంటున్నా. ఈ విచారణ పూర్తయ్యే వరకు, నా మంత్రి పదవికి రాజీనామాను ఆమోదించాలని పార్టీని, ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే మేనేజర్ ఆత్మహత్యపై నిష్పక్షపాత విచారణ జరిగేలా చూసేందుకు, రవాణా శాఖ మంత్రి అయిన భుల్లర్ను రాజీనామా చేయమని తాను కోరినట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు.
Also Read:
Air India flight U-turn over China | కెనడా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. చైనా గగనతలంలో యూటర్న్
woman gets her own son sentenced | భర్త హత్య కేసులో.. కొడుకుకు జీవిత ఖైదు శిక్ష వేయించిన మహిళ
Watch: 18 మంది నిందితులను పబ్లిక్గా చితకబాదిన పోలీసులు.. ఎందుకంటే?