న్యూఢిల్లీ/లక్నో, జూన్ 14: అయోధ్యలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రవి తివారీ, సుల్తాన్ అన్సారీ మార్చి 18న కుసుమ్ పాఠక్ నుంచి 1.208 హెక్టార్ల స్థలాన్ని రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. రామాలయం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆ స్థలాన్ని ఐదు నిమిషాల వ్యవధిలోనే వారి దగ్గరినుంచి రూ.18.5 కోట్లకు కొన్నది. కేవలం 5 నిమిషాల్లో ఆ స్థలం విలువను 9 రెట్లు పెంచి కొనడంపై తీవ్రదుమారం రేగుతున్నది. ట్రస్టు అవినీతికి పాల్పడుతున్నదని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పారీ ్ట(ఆప్) ఆరోపించాయి. ఆలయ భూముల కొనుగోలులో కుంభకోణం జరుగుతున్నదని, సుప్రీంకోర్టు కలుగజేసుకోవాలని కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రణ్దీప్ సూర్జేవాలా సోమవారం విలేకరులతో మాట్లాడారు. భూముల కొనుగోలుపై సుప్రీంకోర్టు నేతృత్వంలో దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో అక్రమాలకు పాల్పడుతున్నారని, ట్రస్టుకు వచ్చిన విరాళాలపై ఆడిట్ జరుపాలని కోరారు.రాముడి పేరు మీద అవినీతికి పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు.దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని అన్నారు. భూమి కొనుగోలులో బీజేపీ నేతల హస్తం ఉన్నదని ఆరోపించారు.
సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరుపాలి
ఆలయ భూముల కొనుగోలుపై బీజేపీ, వి పక్షాల మధ్య సోమవారం మాటల యుద్ధం జరిగింది. ‘శ్రీరాముడు అంటేనే న్యాయం, సత్యం, విశ్వాసం. ఆయన పేరుమీద మోసాలకు పాల్పడటం సరైనది కాదు’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ట్రస్టును డిమాండ్ చేశారు. ఎస్పీ నేత పవన్ పాండే, ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ దీనిపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
నిర్మాణాన్ని అడ్డుకోవడానికే
అవినీతి ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆలయ నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రామభక్తుల రక్తంతో చేతులు తడుపుకొన్నవారు మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని యూపీ డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ ఆరోపించారు.
రాజకీయ ప్రేరేపితం
ఆలయ భూముల కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ట్రస్టు జనరల్ సెక్రెటరీ, వీహెచ్పీ సీనియర్ నేత చంపత్ రాయ్ తిరస్కరించారు. ఇవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోపణలకు భయపడమని అన్నారు.