దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్న బీజేపీకి, ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో జరిగిన రోడ్ షోలో వినోద్కుమార్ మాట్లాడారు. వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడం, కనీసం అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. వేములవాడను మోదీ ఎందుకు విస్మరించాడో ప్రజలు గమనించాలని సూచించారు.
దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు గుంజుతుంది తప్ప దేవాలయాలను అభివృద్ధది చేయడం లేదని బోయిన్పల్లి వినోద్కుమార్ విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఒక్క గుడికి, బడికి కూడా నిధులు మంజూరు చేయించలేదని.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతాడని మండిపడ్డారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనంతరం విస్మరించిందని పేర్కొన్నారు. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కరెంటు కోతల్లో, రైతు బంధు ఎగ్గొట్టడంలో, కేసీఆర్ కిట్ బంద్ చేయడంలో, కల్యాణలక్ష్మీ రద్దు చేయడంలో, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంలో, రుణమాఫీని విస్మరించడంలో మాత్రం మార్పు తెచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీల ముచ్చట మర్చిపోయి.. ఏ గుడికాడికి పోతె ఆ గుడి దేవుడిపై ఒట్టు వేస్తూ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డివన్నీ జూటా మాటలని విమర్శించారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.