న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విద్యార్థులతో చర్చించనున్నారు. ఏటా విద్యార్థులతో నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం బుధవారం వర్చువల్ విధానంలో సాగనుంది. సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రశ్నలతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో చర్చా కార్యక్రమం ఉంటుందని ప్రధాని ట్వీట్ చేశారు. సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చకు సంబంధించి ముఖ్యాంశాలతో కూడిన ఓ వీడియోను మోదీ ట్వీట్కు ట్యాగ్ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడిగే పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానాలివ్వనున్నారు. పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులల్లో భయాందోళనలను తొలగించడానికి 2018 నుంచి ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్థులతో మాట్లాడనున్నారు. కార్యక్రమాన్ని ప్రభుత్వం దూరదర్శన్, ఆకాశవాణిలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.