పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్జీ హన్మంతు
వరంగల్, ఏప్రిల్ 26 : పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సెక్టోరియల్ అధికారులదేనని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ఆయన సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకుని తిరిగి వెళ్లే వరకూ అన్ని వసతులు, ఏర్పాట్లు సెక్టోరియల్ అధికారులే కల్పించాలన్నారు. ఒక సెక్టోరియల్ అధికారికి 20 పోలింగ్ కేంద్రాలు కేటాయించామన్నారు. 30న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నాటి కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీలో సెక్టోరియల్ అధికారుల పాత్ర కీలకమన్నారు. 878 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రి పంపిణీని నిట్, ఆర్ట్స్ కళాశాలల్లో చేపట్టనున్నట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు, ఫర్నిచర్, మరుగుదొడ్లు తదితర ఏర్పాటు చేయా లని సూచించారు. పోలింగ్ కేంద్రాల ఎదుట టెంట్లు, కుర్చీలు, తాగునీటి వసతులు కల్పించాలని ఆదేశించారు. కచ్చితంగా 30వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలన్నారు. సమావేశంలో గ్రేటర్ ఎస్ఈ సత్యనారాయణ, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ కోసం మంగళవారం సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 80 ఏళ్లు పైబడిన వారు, కరోనా బాధితులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిందన్నారు. దీన్ని ఉపయోగించుకునే వారు బల్దియా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
పరిశుభ్రంగా ఉండేలా చూడాలి
పోలింగ్ కేంద్రాలతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. కార్యాలయంలో పారిశుధ్య జవాన్లతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. సెక్టోరియల్ అధికారులకు శానిటరీ ఇన్స్పెక్టర్లు పోలింగ్ కేంద్రాల రూట్ చూపించాలని సూచించారు. శానిటేషన్ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఖాళీ స్థలాలు ఉంటే డోజర్లతో శుభ్రం చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పారిశుధ్య కార్మికులు అం దుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశిం చారు. సిబ్బంది యూనిఫాం, మాస్క్లు తప్పనిసరిగా ధరించాలన్నారు. సమావేశంలో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు మాదాసి సాంబయ్య, నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సునీల్, ఉపేందర్, సాంకేతిక నిపుణులు సురేశ్, జవాన్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ను ఆపే ప్రసక్తే లేదు.. వెళ్లిపోయే వాళ్లు వెళ్లిపోవచ్చు: బీసీసీఐ
నుమాన్ శోభాయాత్రకు హైకోర్టు అనుమతి