ముంబై: రెండు వారాల నుంచి సాఫీగా సాగిపోతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకే రోజు నలుగురు ప్లేయర్స్ సడెన్గా లీగ్ను వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అశ్విన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ ఆండ్రూ టై లీగ్ నుంచి వెళ్లిపోయారు. వీళ్లలో అశ్విన్, టై మాత్రం కొవిడ్ కారణంగా వెళ్లిపోతున్నామని చెప్పగా.. మిగతా ఇద్దరు వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.
దీనిపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందించారు. ఐపీఎల్ను మాత్రం ఆపే ప్రసక్తే లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఇప్పటి వరకైతే ఐపీఎల్ సజావుగా సాగిపోతోంది. ఎవరైనా వెళ్లిపోవాలంటే వెళ్లి పోవచ్చు. వాళ్లకు మేము అడ్డుపడము. లీగ్ మాత్రం కొనసాగుతుంది అని ఆ అధికారి తేల్చి చెప్పారు. కొవిడ్తో సతమతమవుతున్న తన కుటుంబానికి అండగా ఉండటానికి తాను వెళ్తున్నట్లు అశ్విన్ చెప్పాడు. పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ లీగ్లోకి వస్తానని అతను స్పష్టం చేశాడు.