NISAR satellite : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలనా ఉపగ్రహం (Satellite) ‘నిసార్ (NISAR)’ మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. బుధవారం సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోట (Sriharikota) లోని సతీష్ ధావన్ (Satish Dhavan) అంతరిక్ష కేంద్రం (Space centre) నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
ఏకంగా 1.5 బిలియన్ డాలర్లను ఖర్చుతో ప్రయోగిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అదేవిధంగా సహజ విపత్తులను, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలకపాత్ర పోషించనుంది. నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) అనేది ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు అని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇది డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (నాసా ఎల్-బ్యాండ్, ఇస్రో ఎస్-బ్యాండ్) ను ఉపయోగించి భూమిని మొదటిసారిగా పరిశీలించనుంది. 2,392 కిలోగ్రాముల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్కు చెందిన జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ రాకెట్.. నిసార్ ఉపగ్రహాన్ని 740 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్ష్యలోకి చేరుస్తుంది.
నిర్ణీత కక్ష్యలోకి చేరిన తర్వాత అది ప్రతి 12 రోజులకు భూమిని, మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక-రిజల్యూషన్ చిత్రాలతో స్కాన్ చేస్తుంది. అందుకోసం మొదటిసారిగా స్వీప్సార్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.