Draupadi Murmu | రాష్ట్రపతి ఎన్నికలు ( Presidential Polls ) దగ్గరపడే కొద్దీ పోటీలో ఎవరుంటారనే ఉత్కంఠ పెరిగిపోతూ వచ్చింది. ఇలాంటి సమయంలో యశ్వంత్ సిన్హా ( Yashwant Sinha )ను విపక్షాలు బరిలో దించాయి. విపక్షాలు సీనియర్ నేతను రంగంలోకి దించడంతో.. అధికార బీజేపీ ఎవరిని బరిలో దింపుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఉత్కంఠకు తెర దించిన బీజేపీ.. అనూహ్యంగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది. 64 ఏళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్ ( Tribal Leader ).. తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో జన్మించారు. శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే భర్త, కుమారులు ఇద్దరూ చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు.
1997లో రాయ్రంగాపూర్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. బీజేపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.. రాయ్రంగాపూర్ నియోజకవర్గం నుంచే 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలో బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య, రవాణా శాఖలతోపాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు. 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె.. 2015లో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆ పార్టీకి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు లభించే అవకాశం ఉంది. వివాద రహితురాలిగా పేరున్న ద్రౌపదికి.. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్తోపాటు ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో ద్రౌపదికి మంచి అనుబంధం కూడా ఉండటం వల్ల వాళ్ల మద్దతు బీజేపీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీకి ఆదివాసీల ఓట్ల షేర్ పెరగడమే కాకుండా.. ఒడిశాలో పార్టీకి మద్దతు పెరుగుతుందని ఆ పార్టీ సీనియర్ల అభిప్రాయం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో కూడా ద్రౌపది ముర్ముకు స్నేహపూర్వక అనుబంధం ఉంది. కావున ఆమెకే ఒడిశా సీఎం మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వచ్చే రెండేళ్లలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఇక్కడ కీలకమైన ఆదివాసీల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. వాటిలో భాగంగానే ఆదివాసీ నేత అయిన ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
మహా సంక్షోభం | ఏక్నాధ్ షిండేకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలపై చర్యలు : సంజయ్ రౌత్ వార్నింగ్