న్యూఢిల్లీ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో ప్రతిపక్షాలకు చెందిన 18 పార్టీల నాయకులు సమావేశమై యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి చేశారు. యశ్వంత్ సిన్హా గతంలో కేంద్ర ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం తృణమూల్ పార్టీలో కొనసాగుతున్న యశ్వంత్ సిన్హా.. ఇవాళ ఉదయం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో మీటింగ్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు ఇవాళ అధికార బీజేపీ పార్టీ కూడా తమ అభ్యర్థిని తేల్చనున్నది. పార్లమెంటరీ బోర్డు మీటింగ్కు ప్రధాని మోదీ వర్చువల్గా హాజరుకానున్నారు. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత 24 ఏండ్ల పాటు ఐఏఎస్ అధికారిగా కొనసాగి 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా, 1998, 1999, 2009లో హజారీబాగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో చంద్రశేఖర్ కేబినెట్లో ఏడాది పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 2002లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. 2021, మార్చి 13న తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. మార్చి 15న టీఎంసీ వైస్ ప్రెసిడెంట్గా యశ్వంత్ సిన్హా నియమితులయ్యారు.