ముంబై : ఈడీ చర్యలకు భయపడి ఏక్నాధ్ షిండే శివసేనపై తిరుగుబాటు చేశారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఏక్నాధ్ షిండేకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తమను షిండే బలవంతంగా తీసుకువెళ్లారని పలువురు ఎమ్మెల్యేలు తమకు చెబుతున్నారని రౌత్ వెల్లడించారు. తమ ఎమ్మెల్యేలు గుజరాత్ పోలీసుల బందీలుగా ఉన్నారని, మహారాష్ట్ర పోలీసులకు అవకాశం ఇస్తే వారంతా తిరిగి తమవైపు వచ్చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏక్నాధ్ షిండేతో ప్రస్తుతం కేవలం 17 నుంచి 18 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని చెప్పారు. బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన భేటీకి 33 మంది శివసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారని తెలిపారు. ఎంవీఏలో ఎలాంటి చీలిక లేదని, తామంతా కలిసి ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తున్నామని, సమీకరణాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు.
ఇప్పటివరకూ బీజేపీ నుంచి లేదా ఏక్నాథ్ షిండే నుంచి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన రాలేదని అయితే రాజకీయాల్లో ఏ క్షణాన ఏమైనా జరగవచ్చని పాటిల్ వ్యాఖ్యానించారు.ఇక అధికారం కోసం తాము బాలాసాహెబ్ సిద్ధాంతాలకు దూరం జరగలేదని ఏక్నాధ్ షిండే పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మూడోసారి ప్రయత్నం చేశారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు.