– ‘నమస్తే తెలంగాణ’ కథనాలకు స్పందన
బూర్గంపహాడ్, ఆగస్టు 05 : ఈ నెలలోనే భద్రాచలం-సారపాక మధ్యలో నిర్మించిన నూతన వంతెనపై రాకపోకలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం వంతెన వద్ద అప్రోచ్ పనులను ఆయన పరిశీలించారు. వంతెన పనులకు సంబంధించి ఇటీవల కాలంలో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన మంత్రి తుమ్మల రెండవ వంతెన వద్ద అప్రోచ్ కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. మూడు నెలలు గడిచినా పనులు ఆలస్యం ఎందుకు అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలలోనే పనులు పూర్తిచేసి భద్రాచలం-సారపాక మధ్యలో నిర్మించిన రెండవ వంతెన రాకపోకలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భద్రాచలంలో గతంలో, అంతకుముందు పుష్కరాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో కొత్తగా రెండవ వంతెన నిర్మాణం చేపట్టడం జరిగిందని.. చాలా ఏళ్లుగా నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో గత ఏడాదే నూతన వంతెన నిర్మాణం పూర్తిచేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదల కారణంగా కొత్త వంతెన వద్ద అప్రోచ్ కుంగిపోవడంతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారని, త్వరితగతిన పనులు పూర్తిచేసి ఈ నెలలోనే కొత్త వంతెనపై రాకపోకలు పునరుద్ధరిస్తామని, వంతెన అప్రోచ్ పనుల విషయంలోనూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తుమ్మల తెలిపారు. ఆయన వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సారపాక, భద్రాచలం సర్పంచులు గుగులోత్ కిశోర్నాయక్, పూనెం కృష్ణ, సారపాక ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, ఎస్ఏ సమీర్, తిరుపతి చంటి, ఐటీసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్, సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.