న్యూఢిల్లీ : ఆర్మీ శునకాలు ఇప్పటికే సైన్యంలో అనేక ధైర్య సాహసాలు కనబరుస్తున్నాయి. ఇప్పుడు ఏరియల్ ఆపరేషన్లో పాల్గొనేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్మీ చరిత్రలోనే మొదటిసారి ఓ కాంబాట్ డాగ్ పారాచూట్ జంప్ చేసింది. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్ వద్ద సూర్య కమాండ్లోని ఓ పారాట్రూపర్, ఒక డాగ్ హ్యాండ్లర్ తన కాంబాట్ డాగ్ కలిసి పూర్తి స్థాయి యుద్ధ సామగ్రితో గాల్లో విమానం నుంచి జంప్ చేశారు. దీనిపై సూర్య కమాండ్ పోస్టు చేస్తూ.. భారత సైన్యంలో మరో ముందడుగు పడబోతున్నదని రాసుకొచ్చింది. ఒక సైనికుడు, శిక్షణ పొందిన శునకానికి ఉన్న అనుబంధంతో పాటు నమ్మకం ఇందులో కనబరిచారని పోస్టులో పేర్కొన్నది. ధైర్యం, కచ్చితత్వం, యుద్ధ నైపుణ్యాలను పెంచడంలో భాగంగా శునకాలకు ఇలాంటి శిక్షణలు మరిన్ని ఇవ్వబోతున్నట్టు సూర్య కమాండ్ అధికారులు వెల్లడించారు.