శ్రీనగర్: కశ్మీర్లో మతసామరస్యం వెల్లివిరిసింది. ఒకప్పుడు కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టిన చోటే.. ఓ హిందువు అంత్యక్రియలను ముస్లిం సోదరులు నిర్వహించారు. పుల్వామా జిల్లాలోని తహబ్ గ్రామానికి చెందిన చమన్ లాల్.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఏడు పదుల వయస్సున్న ఆయన స్నేహితుల్లో ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. కాగా, ఆయన వయోధిక సమస్యలతో శనివారం మృతిచెందారు. గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు కొద్దిమందే ఉన్నారు. ఆయన కుమారుడు, కూతురు జమ్ములో ఉంటున్నారు. వారు గ్రామానికి చేరుకునేలోపే.. లాల్ ఇంటి చుట్టుపక్కన ఉన్నవారే అయినవారు అయ్యారు. ఆయన అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. అతని పార్ధీవ దేహాన్ని తమ భుజాలపై మోస్తూ భారీ సంఖ్యలో యువకులు, పెద్దలు స్మశానవాటికకు తరలించారు.
కాగా, తమ తండ్రిని సొంతమనిషిలా చూసుకున్న గ్రామస్తులకు చమన్ లాల్ కుమారుడు ధన్యవాదాలు తెలిపారు. చమన్ లాల్ను తాము ఎప్పుడూ పండిగా చూడలేదని, తమలో ఒకడిగానే భావించామని మహ్మద్ సుల్తాన్ అనే వృద్ధుడు అన్నారు. అందుకే అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తాము పూర్తిచేశామని చెప్పారు.
1990లో కశ్మీరీ లోయలో జరిగిన హింస తర్వాతా చాలా పండిట్ కుటుంబాలు అక్కడి నుంచి వలస వెళ్లాయి. అయితే చమన్ లాల్ వంటివారు కొద్ది మాత్రమే సొంత ఊరును వదిలి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి