లక్నో: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి, ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వాలు విస్తృతంగా టీకాలు పంపిణీ చేయడంతోపాటు, లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. అయితే మహమ్మారి విస్తృతిని నిలువరించడానికి గో మూత్రం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని, దానిని ప్రతిరోజూ తాగాలని ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చాడు. తాను ఆరోగ్యంగా ఉండటానికి అదే కారణమని చెప్పాడు.
ఉత్తరప్రదేశ్లోని బైరియా నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.. ప్రతిరోజు గోమూత్రం తాగడం వల్ల కరోనాను నిలువరించవచ్చని చెప్పారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని వెల్లడించారు. తాను రోజులో 18 గంటలు పనిచేయడానికి అదే కారణమని వెల్లడించారు. రెండు లేదా మూడు మూతల గో మూత్రాన్ని ఒక గ్లాసు నీళ్లలో కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలని తెలిపారు.
అయితే ఆవు పంచకం తీసుకున్న అరగంట వరకు ఎలాంటి పదార్థాలు తినడం కానీ తాగడం కానీ చేయవద్దని కూడా సూచించారు. ఇలా చేయడం వల్ల కేవలం కరోనాను మాత్రమే కాకుండా అనేక రోగాలను నయం చేయడానికి దోహదపడుతుందని, ప్రత్యేకంగా గుండె సంబంధిత వ్యాధుల బారినపడకుండా చేస్తుందని వెల్లడించారు. తాను ప్రతిరోజూ తాగుతానని అందువల్లే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. సైన్స్ను నమ్మినా నమ్మకపోయినా.. ఆవు పంచకంపై మాత్రం అపారమైన విశ్వాసం ఉన్నదని చెప్పారు.
ఇలా గో మూత్రాన్ని ఎలా తాగాలి, ఎంత మొత్తం తీసుకోవాలని వివరిస్తూ ఆయన రూపొందించిన విడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి