ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శరణార్థులను మర్యాద పూర్వకంగా వెనక్కి పంపాలని సరిహద్దు జిల్లాల అధికారులకు ఈ మేరకు రహస్య ఆదేశాలు జారీ చేసింది.
భారత్కు పొరుగు దేశమైన మయన్మార్లో ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ దేశ పాలనను సైన్యం తన ఆధీనంలోకి తీసుకున్నది. సైనిక తిరుగుబాటు వ్యతిరేక నిరసనలను అణచివేస్తున్నది. నిరసకారులపై బులెట్ల వర్షం కురిపిస్తున్నది. ఇప్పటి వరకు సైన్యం కాల్పుల్లో సుమారు ఐదు వందల మంది ప్రజలు మరణించి ఉంటారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మయన్మార్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు వలసపోతున్నారు. పొరుగున ఉన్న థాయ్లాండ్, బంగ్లాదేశ్, భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు.
మయన్మార్తో భారత్కు 1,643 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉన్నది. మణిపూర్, మిజోరమ్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు మయన్మార్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో మయన్మార్ శరణార్థులపై మణిపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించగా మరోవైపు మిజోరామ్ మాత్రం వారిపట్ల ఉదారత చూపుతున్నది. శరణార్థులను అనుమతించడంతోపాటు శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం సమకూర్చుతున్నది.
ఈ పరిస్థితుల్లో మయన్మార్తో సరిహద్దు కలిగిన నాలుగు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారిని తప్ప మయన్మార్ శరణార్థులను అనుమతించవద్దని పేర్కొంది. వారిని శరణార్థులుగా అంగీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ లేదా 1967 ప్రోటోకాల్లో భారత్ సంతకం చేయలేదని వెల్లడించింది.