కోల్కతా: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై వివాదాలు వెంటాడుతున్నాయి. (SIR Row) ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి ‘సర్’ విచారణ కోసం కేంద్రానికి బయలుదేరాడు. రోడ్డు ప్రమాదంతో అతడి భార్య, కుమారుడు మరణించారు. వారి మృతదేహాలను ఆసుపత్రి మార్చురీలో ఉంచిన ఆ వ్యక్తి ‘సర్’ విచారణకు హాజరయ్యాడు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో ఈ సంఘటన జరిగింది. మహ్మద్ యాసిన్ అన్సారీ ఉపాధ్యాయుడు. పత్రాల్లో వ్యత్యాసం కారణంగా అన్సారీ, ఆయన భార్య హలీమా ఖాతూన్ను ‘సర్’ విచారణ కోసం కేంద్రానికి రావాలని ఎన్నికల అధికారులు పిలిచారు.
కాగా, శుక్రవారం అన్సారీ తన భార్య, 9 నెలల కుమారుడితో కలిసి ‘సర్’ విచారణ కేంద్రానికి చేరుకునేందుకు ఆటోలో బస్టాండ్కు బయలుదేరాడు. మార్గమధ్యలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అన్సారీ భార్య ఖాతూన్ అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన పసి బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
మరోవైపు రోడ్డు ప్రమాదంలో భార్య, కుమారుడ్ని కోల్పోయిన అన్సారీ వారి మృతదేహాలను ఆసుపత్రి మార్చురీలో ఉంచి ‘సర్’ విచారణకు హాజరయ్యాడు. ‘సర్’ విచారణ కోసమే తాము ప్రయాణమైనట్లు అతడు వాపోయాడు. అది లేకపోతే తాము ఇంట్లోనే ఉండే వాళ్లమని, తన భార్య, కుమారుడు ప్రాణాలతో ఉండేవారని మీడియాతో అన్నాడు. ‘సర్’ విచారణకు వెళ్తూ భార్య, కుమారుడ్ని కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై బెంగాల్లోని అధికార టీఎంసీ నేతలు మండిపడ్డారు. ‘సర్’ ప్రక్రియ ప్రజల ప్రాణాలు తీస్తున్నదని ఆరోపించారు. అయితే టీఎంసీ శవ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీజేపీ విమర్శించింది.
Also Read:
defence officials bribe | లంచం తీసుకున్న రక్షణ శాఖ అధికారులు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సీబీఐ
Karnataka family hang in Bihar | తీర్థయాత్రకు వెళ్లిన కుటుంబం.. సత్రం గదిలో నలుగురు ఆత్మహత్య