కోల్కతా: బీజేపీ అంటే భగ్గున మండిపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ఎంపీకి ఏకంగా బెంగాల్ అత్యున్నత పురస్కారాన్ని ఆమె ప్రదానం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ చర్య అందరినీ ఆశ్చర్యపరిచింది. (Mamata Banerjee) శనివారం మాతృభాష దినోత్సవం సందర్భంగా బెంగాల్కు చెందిన 25 మంది ప్రముఖ వ్యక్తులకు బంగా భూషణ్, బంగా విభూషణ్ అవార్డులను సీఎం మమతా బెనర్జీ అందజేశారు. కళలు, సంస్కృతి, సాహిత్యం, ప్రజా పరిపాలన, ప్రజాసేవకు అసాధారణ కృషి చేసిన వారిని ఈ గౌరవంతో సత్కరించారు.
కాగా, బీజేపీ రాజ్యసభ ఎంపీ నాగెన్ రాయ్ అలియాస్ అనంత మహారాజ్కు కూడా బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారం అయిన బంగా విభూషణ్ లభించింది. ఈ అవార్డు, ప్రశంసా పత్రాన్ని మమతా బెనర్జీ ఆయనకు అందజేశారు. ‘రాజ్బన్షి భాష, సంస్కృతిని ప్రచారం చేసిన సేవకు గాను అనంత మహారాజ్కు ఈ అవార్డును అందించడం మాకు ఆనందంగా ఉంది. రాజ్బన్షి వర్గం, సమాజం కోసం ఆయన నిరంతరం కృషి చేయాలని మేం కోరుతున్నాం’ అని మమతా బెనర్జీ అన్నారు. రాజ్బన్షి సమాజం కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, ఇతర కార్యక్రమాలను ఆమె వివరించారు.
మరోవైపు బీజేపీ ఎంపీ నాగెన్ రాయ్కు బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారం దక్కడం రాజకీయ చర్చకు దారితీసింది. ఆయనతోపాటు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనకు దక్కుతుందని కలలో కూడా ఊహించలేదని నాగెన్ రాయ్ మీడియాతో అన్నారు.
అయితే ఉత్తర బెంగాల్లో ప్రముఖమైన రాజ్బన్షి వర్గం బీజేపీకి మద్దతిస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ రాణించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజ్బన్షి కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆ వర్గం ప్రముఖ నేత అయిన బీజేపీ ఎంపీ నాగెన్ రాయ్ను బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారంతో ఆమె సన్మానించడం విశేషం.
Also Read:
BJP leader denies blankets | ముస్లిం మహిళల పట్ల బీజేపీ నేత వివక్ష.. దుప్పట్ల పంపిణీ నిరాకరణ
Punjab Man Shoots Woman | పెళ్లిని తట్టుకోలేక.. మహిళపై కాల్పులు జరిపిన పొరుగు వ్యక్తి
Student gang raped at party | యువతి అత్యాచారం ఆరోపణ.. బ్లాక్మెయిల్ చేస్తున్నదని నిందితుడి ఫిర్యాదు