ముంబై: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్డౌన్ విధించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. మహమ్మారి వ్యాప్తి పెరగడంతో మరోమారు లాక్డౌన్ విధించనున్నారనే చర్చ జోరుగా సాగుతున్నది. ఈనేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం శుక్రవారం ఏదోఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో ఆంక్షలు విధించారు. మహారాష్ట్రలో నిన్న 43 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 8,646 మంది కరోనా బారినపడ్డారు. కాగా, దేశంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు పుణె జిల్లాలో నమోదయ్యాయి.
గత కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో లాక్డౌన్ విషయంలో ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. కరోనా పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు లాక్డౌన్ను అమలుచేయడానికి సిద్ధంగా ఉండాలని సీఎం ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే అధికారులకు సూచించారు.
అయితే లాక్డౌన్ విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. కరోనా కేసులను నియంత్రించడానికి లాక్డౌన్ ఒక్కటే మార్గం కాదని భాగస్వామ్య పక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), ప్రతిపక్ష బీజేపీ ప్రకటించాయి. మరోమారు లాక్డౌన్ విధించొద్దని సినిమా, రిటైల్, షాపింగ్ పరిశ్రమకు చెందిన సంఘాలు సీఎం ఉద్ధవ్ థాక్రేకు విజ్ఞప్తిచేశాయి. మరో లాక్డౌన్ పరిశ్రమలు భరించలేవని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..