సెలవు దినాల్లోనూ వ్యాక్సిన్
45 ఏండ్లు పైబడిన వారికి మొదలైన టీకా
దేశంలో ఒక్కరోజులోనే 72,330 కేసులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెలలో అన్ని రోజులూ టీకా పంపిణీ చేపట్టాలని నిర్ణయించింది. సెలవు దినాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలు తెరిచే ఉండనున్నాయి. వ్యాక్సిన్ కవరేజీని పెంచేందుకు అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలను సమర్థంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా 45 ఏండ్లు నిండిన వారందరికీ గురువారం నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభమైనట్టు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 6.5 కోట్ల మందికి టీకా ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.
ఒక్క రోజులోనే 459 మంది మృతి
దేశంలో 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 72,330 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,21,665కి పెరిగింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రోజువారీ మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. కొత్తగా 459 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,62,927కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 39,544 కేసులు రికార్డయ్యాయి.