Lok Sabha | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. గణేష్ చతుర్ధిని పురస్కరించుకొని పాత భవనాన్ని వీడి ఎంపీలు కొత్త భవనంలోకి మారారు. ప్రత్యేక పూజ అనంతరం మధ్యాహ్యం 1 గంటల తర్వాత కొత్త భవనంలో లోక్సభ (Lok Sabha) కొలువుదీరింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును (Womens Reservation Bill) కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అభియాన్’ పేరుతో కేంద్రం తీసుకొచ్చింది. బిల్లును సభ్యుల ముందు ఉంచిన కొద్దిసేపటకే దిగువ సభ రేపటికి వాయిదా పడింది (adjourned till tomorrow). రేపటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఇక ఈ బిల్లుపై ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది.
కాగా, సోమవారమే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ బిల్లుకు.. విపక్షాలు కూడా మద్దతు తెలుపుతుండటంతో ఉభయసభల్లో బిల్లు చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. బిల్లు ద్వారా లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా. రాజ్యసభ లేదా శాసనమండలికి ఈ బిల్లు వర్తించదు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడవ వంత సీట్లను రిజర్వ్ చేశారు. ఒక సీటు కోసం ఇద్దరు మహిళా ఎంపీలు పోటీపడకూడదు. ఓబీసీ క్యాటగిరీలో మహిళలకు రిజర్వేషన్ లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత రిజర్వేషన్లు కేటాయించనున్నారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వ్డ్ సీట్లకు రొటేషన్ పద్ధతి కల్పించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్రను పెంచేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారు. గత 27 ఏళ్ల నుంచి మహిళా బిల్లు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.
Also Read..
Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏముంది ? ఎస్సీ/ఎస్టీ కోటా ఎంతంటే?
Elon Musk | యూజర్లకు మస్క్ గట్టి షాక్.. ఇకపై ట్విట్టర్ వాడాలంటే డబ్బు చెల్లించాల్సిందే..!