న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో.. మహిళా రిజర్వేషన్ బిల్లు(Womens Reservation Bill)ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ మహిళలకు ఈ బిల్లు ద్వారా 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. సోమవారమే ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. లోక్సభలో మంత్రి అర్జున్ రామ్మేఘవాల్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇంతకీ ఈ బిల్లులో ఏముందో తెలుసుకుందాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు.. నారీ శక్తి వందన్ అని నామకరణం చేశారు.
బిల్లులో కీలకాంశాలు..
బిల్లు ద్వారా లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా. రాజ్యసభ లేదా శాసనమండలి మండలికి ఈ బిల్లు వర్తించదు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడవ వంత సీట్లను రిజర్వ్ చేశారు. ఒక సీటు కోసం ఇద్దరు మహిళా ఎంపీలు పోటీపడకూడదు. ఓబీసీ క్యాటగిరీలో మహిళలకు రిజర్వేషన్ లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత రిజర్వేషన్లు కేటాయించనున్నారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వ్డ్ సీట్లకు రొటేషన్ పద్ధతి కల్పించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్రను పెంచేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారు. గత 27 ఏళ్ల నుంచి మహిళా బిల్లు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.
#WATCH | In the Lok Sabha of the new Parliament building, Union Law Minister Arjun Ram Meghwal says “This bill is in relation to women empowerment. By amending Article 239AA of the Constitution, 33% of seats will be reserved for women in the National Capital Territory (NCT) of… pic.twitter.com/BpOMzt1ydW
— ANI (@ANI) September 19, 2023
2029 నాటకి మహిళా రిజర్వేషన్ బిల్లు అములోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల అనంతరం, అంటే 2027లో నియోజకవర్గాల పునర్ విభజన ఉంటుంది. 2021 జరగాల్సిన జనాభా లెక్కలను కోవిడ్ వల్ల పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. చట్టంగా మారిన తర్వాత ఆ బిల్లు సుమారు 15 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. ఆ టర్మ్ను కావాలంటే కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రతిసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత.. మహిళలకు కేటాయించిన సీట్లను రొటేషన్ పద్ధతిలో మార్చుతారు. ఓబీసీకు రిజర్వేషన్ కల్పించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీలు మహిళా బిల్లును అందుకే వ్యతిరేకిస్తున్నాయి.
2010లో మన్మోహన్ సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లు ముసాయిదాను తీసుకువచ్చింది. కొత్త బిల్లు దాదాపు ఆ బిల్లుకు సమానంగా ఉంది. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీలకు కోటా కల్పించే సవరణలను కొత్త బిల్లులో ఎత్తివేశారు. ఆర్టికల్ 239ఏ, 330ఏ, 332ఏ ప్రకారం మహిళలకు రిజర్వ్డ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 శాతం మహిళలు మాత్రమే పార్లమెంట్, అసెంబ్లీల్లో ఉన్నారు. ప్రపంచం సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ.