‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం వినోదం, భావోద్వేగాల కలబోతగా ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామాగా మెప్పిస్తుందని చెప్పారు చిత్ర కథానాయికలు అషికా రంగనాథ్. డింపుల్ హయాతి. వీరిద్దరూ రవితేజ సరసన నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ సందర్భంగా శుక్రవారం కథానాయికలు అషికా రంగనాథ్, డింపుల్ హయాతి విలేకరులతో ముచ్చటించారు. ఈ సినిమాలో తన పాత్రపేరు మానసశెట్టి అని, ఆధునిక భావాలు కలిగిన అమ్మాయిగా కనిపిస్తానని, ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా తన క్యారెక్టర్ ఉంటుందని అషికా రంగనాథ్ తెలిపింది.
స్త్రీ పురుష సంబంధాల్లోని సంఘర్షణ, భావోద్వేగాలను ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారని ఆమె చెప్పింది. కెరీర్ ఆరంభంలోనే అగ్రహీరోలతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అషికా రంగనాథ్ ఆనందం వ్యక్తం చేసింది. డింపుల్ హయాతి మాట్లాడుతూ..ఈ సినిమాలో రవితేజ భార్య బాలామణి పాత్రలో కనిపిస్తానని, ఈ కథలో ఊహించని సర్ప్రైజ్లు ఉంటాయని చెప్పింది. సెన్సిబుల్ కామెడీతో పాటు హార్ట్ టచింగ్ మూమెంట్స్తో సినిమా ప్రతీ ఒక్కరిని మెప్పిస్తుందని డింపుల్ హయాతి తెలిపింది.