కరోనా కారణంగా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా వాయిదా పడుతున్నాయి. ఇదే దారిలో పెద్ద సినిమాలు కూడా వెళ్తున్నాయి. అయితే కొందరు నిర్మాతలు మాత్రమే నేరుగా వాటిని ఓటిటిలో విడుదల చేసే ధైర్యం చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు పూర్తైన సినిమాలను అలా చేతిలో పెట్టుకుని ఉంటాం.. రేపు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత సరైన కలెక్షన్స్ రాకపోతే ఏంటి పరిస్థితి అని ముందుగానే నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా కూడా డిజిటల్ లో విడుదల చేయాలని చూస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న నారప్ప సినిమాను నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.
వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాలో నటనకు గానూ రెండోసారి నేషనల్ అవార్డ్ దక్కించుకున్నారు ధనుష్. ఇప్పుడు ఇదదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమాను మే14న విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా కారణంగా అది కుదిరేలా కనిపించడం లేదు. అందుకే మొన్న ఉగాదికి పోస్టర్ విడుదల చేసినా కూడా రిలీజ్ డేట్ విషయంలో సైలెంట్ అయ్యారు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో కరోనా మహమ్మారి తగ్గేలా కనిపించడం లేదు. పైగా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కరోనా కేసులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దాంతో ఈ సినిమాను సెకండ్ వేవ్ లో విడుదల చేసే పరిస్థితి లేదు.
పోనీ ఇంకొన్ని రోజులు వేచి చూద్దాం అనుకున్నా ఎప్పటి వరకు ఈ పరిస్థితులు ఉంటాయో అర్థం కావడం లేదు. అందుకే ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేలా కనిపిస్తుంది. అయితే దీన్ని ఎవరు కొన్నారనేది మాత్రం సస్పెన్స్. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే సినిమా విడుదలయ్యేలా కనిపిస్తుంది. గతేడాది నాని వి సినిమా విడుదలైన తర్వాత మరే స్టార్ హీరో సినిమా కూడా నేరుగా విడుదల కాలేదు. ఇప్పుడు వెంకటేష్ ఈ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.
ఇవికూడా చదవండి..