ఆగ్రా, ఏప్రిల్ 26: యూపీలోని ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ భర్త రవికి కరోనా సోకింది. ఆదివారం ఊపిరి తీసుకోవడం కష్టమైంది. రేణు వెంటనే అతన్ని సమీపంలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజ్కు ఆటోలో తీసుకెళ్లారు. అక్కడ బెడ్లు ఖాళీ లేవు. కనీసం ఆటోలోనే ఉంచి ఆక్సిజన్ పెడదామంటే దవాఖానలో ఆక్సిజన్ కూడా లేదు. భర్త పరిస్థితి అంతకంతకూ తీవ్రమవుతున్నది. తన ఒడిలోనే ప్రాణాలు వదులుతున్న భర్తను చూసి ఆమె విలవిల్లాడింది. భర్తను బతికించుకోవడానికి నోట్లో నోరు పెట్టి ఊపిరులూదింది. ఊపిరితిత్తులకు గాలి వెళ్లి కొద్దిసేపైనా భర్త బతుకుతాడని, అప్పటికి ఏదో ఒక మార్గం దొరక్కపోదని ఆమె ఆశ. కానీ ఆమె ఆశలు ఫలించలేదు. భార్య ఒడిలోనే రవి కన్నుమూశాడు.