కొవిడ్ రోగి ఉన్న ఇంటిలో అందరికీ మాస్క్ తప్పనిసరి
నెలసరి సమయంలోనూ మహిళలు టీకా వేసుకోవచ్చు
వైరస్పై లేనిపోని భయాలతో నష్టమే .. కేంద్రం సూచన
ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించండి
వైరస్పై లేనిపోని భయాలు అవసరం లేదు
ప్రజలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: మీ ఇంటికి ఎవ్వరినీ రానివ్వకండి. అవును! మీరు చదవింది కరెక్టే. ఒకప్పుడు ఇంటికి పిలవకపోతే తప్పు తీసేవాళ్లు. కానీ, ఇప్పుడు పిలిచారో అది పెద్ద నేరం చేసినట్టు లెక్క. అసలే ఇది కరోనా సెకండ్ వేవ్.. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మాట చెప్తున్నది. ఇంటికి ఎవ్వరినీ పిలవకండి అని సూచించింది. ఈ మేరకు దేశ ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకేపాల్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్అగర్వాల్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వీకేపాల్.. ఎవరినైనా సరే ఇంటికి పిలిచే సరైన సమయం ఇది కాదని, ఇంట్లోనే ఉండి కరోనా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ‘మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ కుటుంబసభ్యులను కూడా కాపాడుకోండి. ఇంట్లో ఉన్నా మాస్కు ధరించండి. అవసరం లేకపోతే గడపదాటి బయటకు వెళ్లవద్దు’ అని చెప్పారు. నెలసరి సమయాల్లో కూడా మహిళలు టీకా వేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. లవ్అగర్వాల్ మాట్లాడుతూ దేశంలో కరోనా విజృంభణపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం వంటి నియమాలను పాటించడం, అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తెలిపారు. కరోనా భయంతో అవసరం లేకపోయినా కొంతమంది దవాఖానల్లో చేరుతున్నారని, ఇది సరైనది కాదని, వైద్యుల సూచనల ప్రకారమే హాస్పిటళ్లలో చేరాలన్నారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 14.19 కోట్ల మందికి టీకాలు వేసినట్టు లవ్ అగర్వాల్ వెల్లడించారు.
ఆక్సిజన్ సరఫరాపై జీపీఎస్తో పర్యవేక్షణ
దేశీయ అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని కేంద్రహోంశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తిసంస్థల నుంచి రాష్ర్టాలకు ఆక్సిజన్ను సరఫరా చేయడంలోనే సమస్యలు తలెత్తుతున్నట్టు వెల్లడించింది. అయినప్పటికీ, సరఫరాను వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించింది. ఆక్సిజన్ను రవాణా చేసే ట్యాంకర్ల గమనాన్ని జీపీఎస్ సాయంతో పర్యవేక్షిస్తున్నామని, సాధ్యమైనంత తక్కువ సమయంలోనే ట్యాంకర్లను దవాఖానలకు చేరుస్తున్నట్టు హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మరోవైపు, ద్రవ ఆక్సిజన్ వినియోగంపై విధించిన ఆంక్షలపై కేంద్రం కొంత వెసులుబాటు కల్పించింది. సిరంజీలు, వయల్స్ తయారీ సంస్థలు, ఫార్మా సంస్థలు, రక్షణ సంస్థలు ద్రవ ఆక్సిజన్ను వినియోగించుకోవచ్చని సోమవారం వెల్లడించింది. ఏదైనా జిల్లాలో, నగరంలో వారం రోజులుగా కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి నమోదవుతున్నా, ఐసీయూల్లో 60 శా తం బెడ్లు నిండినా ఆ జిల్లాలు, నగరాల్లో 14 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని కేంద్రం సూచించింది.
సాయుధ దళాల రిటైర్డ్ వైద్య సిబ్బందికి పిలుపు
కరోనా రోగులకు సేవలందించేందుకు ముందుకురావాలని సాయుధ దళాల రిటైర్డ్ వైద్య సిబ్బందిని కోరిన ట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తు తం తాము నివసిస్తున్న ప్రాంతా లకు దగ్గర్లో ఉన్న కరోనా దవాఖానాల్లో వారు సేవలందిస్తారని పేర్కొంది. సైనికదళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్తో ప్రధాని మోదీ సోమవారం సమీక్షించారు. సాయుధ దళాల వద్ద ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఆయా ప్రాంతాల్లో కొవిడ్-19 దవాఖానలకు అందజేస్తామని ప్రధానికి రావత్ తెలిపారు.
ఒక్కరి నుంచి 406 మందికి వైరస్
ప్రజలు భౌతిక దూరం నియమాలు పాటించకపోతే జరిగే అనర్థంపై ఓ పరిశోధన వివరాలను ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం వివరించింది. ‘భౌతిక దూరం నియమాలను పాటించకపోతే నెలరోజుల్లో ఒక వ్యక్తి నుంచి 406 మందికి వైరస్ సోకే ప్రమాదమున్నది. 50 శాతం వరకు నియమాలు పాటిస్తే, వైరస్ వ్యాప్తి 15 మందికి పరిమితం కావొచ్చు. 75 శాతం నిబంధనలు పాటిస్తే, నెల రోజుల్లో సగటున కేవలం 2.5 మందికి మాత్రమే మహమ్మారి సోకవచ్చు’ అని వెల్లడించింది.