Vijay | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మొదట మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఐపీఎల్ ప్రభావంతో వాయిదా పడగా, చివరకు జూన్ 19న విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదల తేదీని ఎంచుకోవడంలో కూడా చిత్ర బృందం ప్రత్యేక వ్యూహం అమలు చేసినట్లు కనిపించింది. జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’, జూన్ 26న రానున్న ‘లెనిన్’ మధ్య గ్యాప్ను క్యాష్ చేసుకోవాలని భావించింది. ఈ లెక్కన ‘మా ఇంటి బంగారం’కు పెద్దగా పోటీ ఉండదని, సోలో రిలీజ్ ప్రయోజనం లభిస్తుందని టీమ్ ఆశించింది.
అయితే ఇప్పుడు ఆ ప్లాన్కు ఊహించని మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’ కూడా అదే తేదీకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఇండస్ట్రీలో హడావుడి సృష్టిస్తున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెట్టే ముందు నటించిన చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫార్మ్లలో జూన్ 19 విడుదల తేదీ కనిపించడంతో ఈ వార్త మరింత బలపడింది.
విజయ్కు తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా ఇది ఆయన చివరి సినిమా కావడం వల్ల ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎక్కువగా ‘జన నాయకుడు’ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది సమంత సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా థియేటర్ల కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్నప్పటికీ స్క్రీన్ కౌంట్ తగ్గితే ఓపెనింగ్స్పై ప్రభావం పడటం సహజమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి సమంత తీసుకునే నిర్ణయంపైనే ఉంది. విజయ్ లాంటి భారీ స్టార్తో పోటీకి సిద్ధమవుతుందా? లేక వ్యాపారపరమైన లెక్కలు చూసుకుని మరోసారి విడుదల తేదీని మార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.