ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 13 : తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను ఆపేందుకు సాహసం చేయలేదని, ఇప్పుడు కేసీఆర్ సీఎంగా లేరనే జీఆర్ఎంబీలో సాగునీటి ప్రాజెక్టులు రద్దుచేయాలనే ఎజెండా పెట్టారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు సాదుకున్న పిల్లి ఇక్కడ సీఎంగా ఉన్నందునే అనుమతులను రద్దు చేయించే సాహసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో జరిగిన గోదావరి వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో పెట్టిన ఎజెండాలో ఆనాడు కరీంనగర్ ఎంపీగా తనతోపాటు ఉన్న ఎంపీలు, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కోసం పర్యావరణ, అటవీ అనుమతులను తీసుకొచ్చి గోదావరి నదిపై కాళేశ్వరం, సమ్మక్కసారక్క, సీతమ్మ ప్రాజెక్టులను నిర్మించినట్టు గుర్తుచేశారు.
ఈ అనుమతులన్నీ రద్దు చేయాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే మోదీ ప్రభుత్వం 18న జరిగే గోదావరి వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో దాన్ని ఎజెండాగా పెట్టారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు జీఆర్ఎంబీ సమావేశానికి బీఆర్ఎస్ గైరాజర్ కానుందని ఆరోపించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8మంది ఎంపీలు గెలిచి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలనే ఎజెండాను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే చంద్రబాబు మాట చెల్లుబాటు అయ్యేదా?, అనుమతుల రద్దు ఎజెండాగా ఉండేదా? అని ప్రశ్నించారు.