Karnataka Results | కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో ముందంజలో ఉండగా.. మూడు స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మేజిక్ఫిగర్113 అన్న విషయం తెలిసిందే. 113 స్థానాలు దాటి ఏ పార్టీ అయినా విజయం సాధిస్తే.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో సర్వేలు చెప్పిందే నిజమవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ (BJP) అధికారం కోల్పోయేలా కనిపిస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన అధికార బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకిచ్చారు. శనివారం వెలువడుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మొదటి నుంచి ఎదురుగాలి వీస్తోంది. స్పష్టమైన ఆధిక్యంలోకి రాలేకపోతోంది. ఓటమి అంచుల్లో కూరుకుపోయింది. ఇప్పటి వరకు 72 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. మరోవైపు ఇప్పటి వరకు వెలువడిన ప్రాంతీయ, జాతీయ మీడియా సర్వేలు, ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేలు ఏ ఒక్కటీ కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. తాజా పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
మరోవైపు కర్ణాటకలో గెలిస్తే దక్షిణాదిలో పాగా వేయొచ్చని భావించిన బీజేపీకి ఈ ఎన్నికలు చెంపపెట్టే. ఈ సారి కూడా రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలన్న కమలం పార్టీ ఉవ్విళ్లూరింది. అగ్రనేతలు రాష్ట్ర పర్యటనలు చేస్తూ కన్నడ ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఏకంగా నాలుగు నెలల్లోనే 9 సార్లు కర్ణాటకలో పర్యటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటక చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మరోవైపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ బడ్జెట్ కేటాయింపులో కర్ణాటకకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అదనంగా రాయితీలు, కొత్త ప్రాజెక్టులు వంటి వరాలు కురిపించింది. అయినా ఫలితం మాత్రం శూన్యమే. ఈ ఎన్నికల ఫలితాలు కమలం నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంవైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను దాటి మరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో (Congress Celebrations) మునిగి తేలుతున్నారు. బెంగళూరు సహా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. డ్యాన్సులు చేస్తూ, డప్పు వాయ్యిధ్యాలు, టపాసులు పేలుస్తూ.. సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గెలుపు సంతోషంలో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటున్నారు.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
Sachin Pilot | కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి ఆ నినాదం బాగా పనిచేసింది: సచిన్ పైలట్
Karnataka Elections | పాత మైసూర్లో మూడో స్థానానికే పరిమితమైన బీజేపీ