హరారే: జింబాబ్వేపై భారత్ మరోసారి పంజా విసిరింది. ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81) , తిలక్ వర్మ (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్) ధనాధన్ అర్ధశతకాలకు తోడు బౌలర్లు రాణించడంతో శనివారం జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. దాంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఈ ఏకపక్ష పోరులో తొలుత భారత్ 20 ఓవర్లలో 219/5 స్కోరు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25), సూర్యవంశీ (20) కూడా ఫర్వాలేదనిపించారు. తర్వాత భారీ టార్గెట్ ఛేజింగ్లో ఆతిథ్య జట్టు 17.5 ఓవర్లలో 129 రన్స్కే కుప్పకూలింది. బ్రియాన్ బెనెట్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32) ఆరంభంలో మెరుపులు మెరిపించినా.. నాలుగో ఓవర్లో అరంగేట్రం బౌలర్ యశ్ ఠాకూర్ (2/30)కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఆపై బెన్ కరన్ (1), కెప్టెన్ సికందర్ రజా (0) ను ప్రిన్స్ యాదవ్ (2/10) పెవిలియన్ చేర్చిన తర్వాత ఆతిథ్య జట్టు కోలుకోలేకపోయింది. ర్యాన్ బర్న్ (20), మరుమణి (24), బ్రాడ్ ఎవాన్స్ (19) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా.. భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు. పార్ట్ టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ (3/17) మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. ఇషాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం జరుగుతుంది.
కిషన్, వర్మ విధ్వంసం..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్… ఇషాన్, తిలక్ మెరుపులతో భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో మాత్రం కాస్త తడబడింది. మరోసారి నిరాశపరిచిన ఓపెనర్ అభిషేక్ శర్మ (8) రెండో ఓవర్లో ముజరబానికి వికెట్ ఇచ్చుకోగా.. 3 ఫోర్లు, ఓ సిక్స్తో జోరుమీద కనిపించిన సూర్యవంశీ కూడా అతడిని అనుసరించడంతో టీమిండియా 29/2తో నిలిచింది. ఈ దశలో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. కెప్టెన్ అయ్యర్తో కలిసి మూడో వికెట్కు 66 పరుగులు జోడించాడు. కాస్త నెమ్మదిగా ఆడిన అయ్యర్ వెనుదిరిగిన తర్వాత ఇషాన్కు తిలక్ తోడవడంతో ఇన్నింగ్స్కు మరింత జోష్ వచ్చింది. తొలి 50 పరుగులను 31 బంతుల్లో పూర్తి చేసిన ఇషాన్, తర్వాత 13 బంతుల్లోనే 31 పరుగులు రాబట్టి జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు హైదరాబాదీ తిలక్ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన తిలక్ 23 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఇషాన్, తిలక్ నాలుగో వికెట్కు 43 బాల్స్లోనే 94 రన్స్ జోడించారు