న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వైద్యం కోసం దవాఖానాల్లో చేరేవారి సంఖ్య అధికమవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ అయిన రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఆందోళన కలిగిస్తున్నది. దీనిని అధిగమించడానికి రెమ్డెసివిర్ మందును బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడాకు లేఖరాశారు.
జార్ఖండ్లో రెమ్డెసివిర్ కొరత ఏర్పడింది. దీంతో సీరియస్ కండీషన్లో ఉన్న కొవిడ్ రోగులకు అవసరమైన ఇంజక్షన్లకు డిమాండ్ అధికమవుతున్నది. అత్యవసర వినియోగం కోసం అవసరమైన 50 వేల వయల్స్ను సరఫరాచేయాల్సిందిగా బంగ్లాదేశ్లోని ఫార్మా కంపెనీలను సంప్రదించాం. వాటిని దిగుమతి చేసుకోవడానికి వీలైనంత తొందరగా అనుమతి ఇవ్వండి అని అందులో పేర్కొన్నారు. ఈమేరకు హేమంత్ సొరెన్ ట్వీట్ చేశారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్నది. గత నాలుగు రోజులుగా 2 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లోని దవాఖానల్లో మంచాలు, మెడికల్ ఆక్సిజన్, మందులు ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..