లింక్ క్లిక్ చేస్తే ఫోన్ డాటా చోరీ: సైబర్ నిపుణులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అత్యాధునిక ఫీచర్ల కోసం ‘పింక్ వాట్సాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలని వస్తున్న సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ పింక్ (#WhatsappPink) పేరిట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న లింక్ను క్లిక్ చేస్తే ఫోన్లోని ఫొటోలు, సందేశాలు, కాంటాక్ట్స్ వంటి సమాచారమంతా సైబర్ కేటుగాళ్ల చేతికి వెళ్లిపోతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్ రాజహరియా తెలిపారు. వాట్సాప్ అధికారిక యాప్ను గూగుల్ ప్లేస్టోర్, యాప్స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ వోయగర్ ఇన్ఫోసెక్ డైరెక్టర్ జితెన్ జైన్ పేర్కొన్నారు. పింక్ వాట్సాప్, గోల్డ్ వాట్సాప్ తదితర యాప్స్ నకిలీవని తెలిపారు. నకిలీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.