న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కరోనా మహమ్మారి ధాటికి దేశ వైద్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది. ప్రతీరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. అనేక రాష్ర్టాల్లో బెడ్లు సరిపోవడం లేదు. తాత్కాలిక దవాఖానలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కేసులు అనూహ్య వేగంతో పెరుగుతుండటంతో అవన్నీ నిండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్కు తీవ్ర కొరత ఉన్నది. ఢిల్లీలో పరిస్థితి క్షణక్షణానికి చేయిదాటిపోతున్నదని, కరోనా రోగుల కోసం ఢిల్లీ ప్రభుత్వ దవాఖానల్లో కనీసం 100 ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులో లేవని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం వెంటనే సాయం చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దవాఖానాల్లో 7వేల బెడ్లను కరోనా రోగుల కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రప్రభుత్వ దవాఖానల్లో దాదాపు 10వేల బెడ్లు అందుబాటులో ఉండగా అందులో ప్రస్తుతం కేవలం 1,800 బెడ్లను మాత్రమే కరోనా రోగుల కోసం కేటాయించారు. ఢిల్లీలోని నర్సింగ్ హోమ్లు, ప్రైవేటు దవాఖానలు కనీసం 80% పడకలను కరోనా రోగుల కోసం కేటాయించాలని కోరింది. రోగులకు చికిత్స అందించడానికి పడకలతో కూడిన ప్రత్యేక కోచ్లను ఏర్పాటు చేయాలని రైల్వేను విజ్ఞప్తి చేసింది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.ఆదివారాల్లో రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. ఆదివారం మార్కెట్లు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు అన్నీ బంద్ ఉంటాయని తెలిపింది. తమిళనాడు బోర్డు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. బీహార్ కూడా రాత్రి పూట కర్ఫ్యూ విధించింది.
దేశంలో కరోనా రెట్టింపు వేగంతో విస్తరిస్తూనే ఉన్నది. శనివారం నుంచి ఆదివారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 2,61,500 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కి పెరిగింది. కొవిడ్తో శనివారం 1,501 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,77,150కి చేరింది. ప్రస్తుతం దేశంలో 18,01,316 మంది చికిత్స పొందుతున్నారు.
మెడికల్ ఆక్సిజన్కు తీవ్ర డిమాండ్ ఉన్న కారణంగా పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. నిషేధం నుంచి కేవలం తొమ్మిది పరిశ్రమలకు మాత్రమే మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిషేధం అమల్లో ఉంటుందని కేంద్రం తెలిపింది.
కొవిడ్ కారణంగా ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకొన్నది. అన్ని రాష్ర్టాల్లోని పలు దవాఖానల్లో 162 పీఎస్ఏ ప్లాంట్లు (ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు) మంజూరు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. పీఎస్ఏ ప్లాంట్లతో దవాఖానలు ఆక్సిజన్ విషయం స్వయం సమృద్ధిని సాధిస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటితో దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 154.19 మిలియన్ టన్నులకు పెరుగుతుందని పేర్కొన్నది.