మెట్రో కథ మళ్లీ మొదటికొచ్చింది. గప్పాలు కొట్టినంత ఈజీ కాదు టేకోవర్ అని తేలిపోయింది. ముందస్తు ప్రణాళికేదీ లేకుండా ఆవేశపూరిత, అనాలోచిత నిర్ణయాలతో తొందరపాటు చర్యలతో రుణసంకటంలో ఇరుక్కుపోయింది. ఒకవైపు అప్పు పుట్టే పరిస్థితి కనిపించకపోవడం, మరోవైపు ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.1,440 కోట్లు ఎల్అండ్టీ ఖాతాలోకి చేరడం, ఎల్అండ్టీ రుణానికీ వడ్డీ కట్టాల్సి రావడంతో ప్రభుత్వం కక్కలేక, మింగలేక తంటాలు పడుతున్నది. మొదటిదశ టేకోవర్ సందిగ్ధంలో పడటంతో.. మెట్రో రెండో దశ పైనా నీలినీడలు అలుముకున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, 2 ఆగస్టు (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియ కథ మళ్లీ మొదటికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత, దుందుడుకు నిర్ణయాల ఫలితంగా ప్రాజెక్టు ఆగమాగమైంది. సగం ధరకే టేకోవర్ చేసి, చాంపియన్లుగా నిలిచామంటూ రేవంత్ సర్కార్ కొట్టిన గప్పాలు బూమరాంగ్ అయ్యాయి. ‘నాలుగు శాతం వడ్డీకే ఐఆర్ఎఫ్సీ రుణాన్ని తీసుకొచ్చాము, హైదరాబాద్ మెట్రో ఇక లాభాల్లో పరుగులు పెడుతుంది’ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే చేసిన ప్రకటనలు ఉత్తవేనని తేలిపోయాయి. ఎల్అండ్టీని బురిడీ కొట్టించామని చెప్పుకొన్న ప్రభుత్వమే ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. రెండో దశ డీపీఆర్ ఆమోదం దేవుడెరుగు, మొదటి దశ టేకోవర్ ప్రక్రియే మళ్లీ మొదటికి రావడంతో ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రుణం వచ్చే దారులు కనిపించకపోవడం, ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.1,440 కోట్లు ఎల్ అండ్ టీ ఖాతాలోకి చేరడం, ఎల్ అండ్ టీ రుణంపై వడ్డీ కట్టాల్సి రావడంతో రేవంత్ సర్కార్ కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల ముందు మెట్రో రెండో దశ పేరుతో హడావుడి చేయాలనుకున్న అధికార పార్టీకి పాలనాపరంగా, రాజకీయంగా సంకట పరిస్థితులు నెలకొన్నాయి.
రూ.43 వేల కోట్ల అంచనాలతో మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని భావించి, మెట్రో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. సంస్థకున్న రూ.13,600 కోట్ల భారీ రుణాన్ని ప్రభుత్వం పేరిట బదిలీ చేయించుకున్నది. దీనిని చెల్లించేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ద్వారా తక్కువ వడ్డీకే రుణం సేకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వానికి ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం రాకుండానే, రూ.1440 కోట్ల ఈక్విటీని ఎల్ అండ్ టీ నుంచి సర్కార్ బదిలీ చేసుకున్నది. అంతేకాదు ప్రాసెస్ ఫీజుల కింద రూ.84.32 కోట్లను ఐఆర్ఎఫ్సీకి చెల్లించింది. గడువు కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసినా కేంద్రం ఆడిన చదరంగంలో రేవంత్ పావులా మారిపోయారు. మెట్రో ద్వారా వచ్చే రాబడిలో ముందుగా నిర్వహణ ఖర్చులు చెల్లించాలని కేంద్రం స్పష్టం చేయగా, ఐఆర్ఎఫ్సీ రుణానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం అంగీకరించడం పెద్ద చిక్కుముడిగా మారింది. ఫలితంగా ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం ఆగిపోయింది. ఇప్పుడు ప్రత్యామ్నా య రుణం కోసం ప్రభుత్వం బ్యాంకుల చుట్టూ తిరిగే దుస్థితి దాపురించింది.
దాదాపు రూ.43 వేల కోట్లతో నగరంలో మెట్రో నిర్మిస్తున్నామనే ప్రచారంతో పొటికల్ మైలేజ్ తెచ్చుకోవాలనుకున్న ప్రభుత్వం.. మెట్రో ఫేజ్-1తో చేతులు కాల్చుకున్నది. మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణ అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ రుణ ప్రక్రియ ఆగిపోవడం, ఫేజ్-1 కథ మళ్లీ మొదటికి రావడంతో ఇటు ప్రభుత్వపరంగా, అటు రాజకీయంగా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి ఫేజ్-1 గుదిబండగా మారుతుందని మొదటి నుంచీ నిపుణులు హెచ్చరించారు. కానీ ప్రభుత్వం పొలిటికల్ మైలేజ్, రూ.18వేల కోట్ల భూములపై ఉన్న ఆశతో వెనుకాముందూ చూడకుండా ముందుడుగు వేసింది. మొత్తం వ్యవస్థనే ఆగమాగం చేసింది. జాప్యానికి కేంద్రమే కారణమనే నెపం నెట్టివేసే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో హడావుడిగా అధికారులతో సమీక్షలు నిర్వహించి, ప్రత్యామ్నాయ రుణ ప్రక్రియ అంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నదని పలువురు రాజకీయ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
పీపీపీ మోడల్ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వైదొలగాలని భావించిన ఎల్ అండ్ టీ సంస్థకు ఈ జాప్యం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. గతంలో నిర్వహణ భారం, అప్పుల బాధ్యత, నెలవారీ వడ్డీల చెల్లింపులను ఎల్అండ్టీ సంస్థ చూసుకునేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీన ప్రక్రియకు ఒప్పందం చేసుకోవడంతో ఇప్పుడు అప్పుల భారం ప్రభుత్వంపై పడింది. టేకోవర్ ఆలస్యం కావడంతో రోజుకు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే మోయాల్సి వస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. ఒప్పందం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు గత రెండు నెలల్లో ఏకంగా రూ.150-180 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడింది. సగం ధరకే ప్రాజెక్టును కొనుగోలు చేశామని, తక్కువ వడ్డీకే రుణం తెచ్చామని, ఏటా రూ.250-300 కోట్ల భారాన్ని తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయింది. కానీ ముందస్తు ప్రణాళికాలోపం కారణంగా ఆర్థిక ఊబిలో ఇరుక్కుపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.