హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): మార్కెటింగ్ శాఖ అధికారుల పనితీరుపై మంత్రి తుమ్మల అసంతృప్తిగా ఉన్నారా? అధికారులు ఉన్నా లేనట్టేననే భావనలో ఉన్నారా? ఎక్కడి పనులు అక్కడే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారా? మార్కెట్ కేంద్రాలుగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిలదీశారా? అవినీతి ఉద్యోగులకు అధికారులు వంత పాడటంపై మండిపడ్డారా? ఇంజినీరింగ్ విభాగంపై విరుచుకుపడ్డారా? ఇందుకు శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశం వేదికైందా? అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. శనివారం సచివాలయంలో మార్కెటింగ్ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల పనితీరుపై లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్టుగా మార్కెటింగ్ శాఖలో చర్చ జరుగుతున్నది.
‘ఎన్నిసార్లు చెప్పినా మారరా? పనులు చేయరా?’ అంటూ ఫైర్ అయినట్టు తెలిసింది. ఒక దశలో ముగ్గురు ఉన్నతాధికారులపై నిప్పులు చెరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘మీ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. ముందు మిమ్మల్ని తీసి అవతల పడేస్తే అంతా బాగుపడతది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘కింది స్థాయి ఉద్యోగులతో పని చేయించడం లేదు, ఇందుకు పూర్తి బాధ్యత మీదే’ అంటూ సెక్రటరీ సురేంద్రమోహన్, మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవి కుమార్పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
‘నేను చెప్పిన ఏ పని కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు.. ఎందుకు కాలేదు?’ అని ప్రశ్నించారని, మార్కెట్లను డిజిటలైజేషన్ చేయాలని ఎప్పుడో ఆదేశాలిచ్చినా, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మార్కెట్లలో సోలార్ప్లాంట్ల ఏర్పాటుపైనా ఇప్పటి వరకు చర్యల్లేవని మండిపడినట్టు సమాచారం. ఇక దశలో ఇంజినీరింగ్ విభాగం అధికారులపై మంత్రి ఆగ్రహంతో ఊగిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పనులు చేయడంలో ఈ విభాగం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విభాగంతో ఎలాంటి ఉపయోగం లేదని, రద్దు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది.
పత్తి కొనుగోళ్లు, మార్కెట్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మంత్రి తుమ్మల సీరియస్ అయినట్టు సమాచారం. మార్కెట్లలో ప్రభుత్వ సొమ్మును కాజేస్తుంటే ఏం చేస్తున్నారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. అన్ని మార్కెట్లను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని, మొత్తం డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించినా ఎందుకు అమలు చేయడంలేదని నిలదీసినట్టు సమాచారం. అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారని, సస్పెండ్ చేయడం, మళ్లీ వారికి పోస్టింగ్లు ఇవ్వడం, అది కీలక స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వడంపైనా మండిపడ్డారన్న చర్చ నడుస్తున్నది.
‘వారిని మరింత దోచుకోవాలని సూచిస్తున్నారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వెంటనే విజిలెన్స్ నివేదిక తెప్పించుకోవాలని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు సమాచారం. ‘విజిలెన్స్ నివేదిక ఆధారంగా రాబోయే పత్తి కొనుగోళ్ల సీజన్కు పక్కా ప్రణాళిక రూపొందించాలి. పత్తి కొనుగోళ్లలో అక్రమాలను సహించేది లేదు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేయడం కాదు.. ఉద్యోగం నుంచే తొలసాగిస్తాం’ అంటూ హెచ్చరించినట్టు చర్చ నడుస్తున్నది.