వెంగళరావునగర్, ఆగస్టు 2: ఓ మైనర్ కారు నడిపి ఒకరి ప్రాణాలు బలిగొనడంతోపాటు ఏడు బైకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కార్మికనగర్లో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ హెచ్ఎఫ్నగర్కు చెందిన 17 ఏండ్ల బాలుడు ఇంటర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం తన ఇద్దరు స్నేహితులతో కలిసి కార్మికనగర్కు వచ్చాడు. వారిలో ఒక బాలుడు అద్దెకు తీసుకున్న బాలెనో కారును శుభ్రం చేసిన అనంతరం తన బైక్పై ఇంటికి వెళ్లిపోయాడు. కారు తాళాలు వాహనంలోనే ఉండగా, అతని స్నేహితుడు కొద్దిదూరం కారు నడిపి పకన నిలిపాతడు.
అనంతరం మరో బాలుడు కారు నడుపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి.. రోడ్డుపై పార్చేసి ఉన్న 7 బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. అదేసమయంలో స్కూటీపై వచ్చిన అన్నదమ్ములు రాజ్కుమార్(60), ప్రభాకర్(55) రోడ్డు పక్కన తమ వాహనాన్ని పార్క్ చేస్తుండగా వారిని కూడా ఢీకొట్టాడు. ఈక్రమంలో ఒకరిపైనుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రాజ్కుమార్, ప్రభాకర్ను స్థానికులు వెంటనే ప్రైవేట్ దవాఖానకు తరలించగా రాజ్కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభాకర్ చికిత్స పొందుతున్నాడు. వీరు కార్మికనగర్ నివాసితులు. ఆదివారం ఉదయం చర్చ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 7 బైకులు ధ్వంసమయ్యాయని, బాలుడు కారును ఎలా నడిపాడు? అద్దె కారును ఎవరు అతని చేతికి ఇచ్చారు? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.