సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్ల యజమానులకు ఆర్థిక వెసులుబాటు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5,966 మందికి లబ్ధి
కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాసట
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ఆదిలాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి):కేసీఆర్ సర్కారు కులవృత్తులకు కొండంత అండగా నిలుస్తున్నది. చేనేత, గౌడ, బ్రాహ్మణ తదితర సంఘాలకు భవనాలు నిర్మించి, పథకాలు అమలు చేస్తుండగా.. రజక, నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా కులవృత్తిపై ఆధారపడి జీవించేవారికి విద్యుత్ భారం తగ్గనుండగా.. ఉపాధి మెరుగుపడనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 4,380 సెలూన్లు, 1,500 లాండ్రీ దుకాణాలు, 86 ధోబీఘాట్లు ఉన్నాయి. వీటిని నిర్వహిస్తున్న 5,966 మందికి ప్రయోజనం చేకూరనున్నది. బిల్లుల చెల్లింపు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సర్కారు నిర్ణయం తీసుకోవడంతో రజకులు, నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
కులవృత్తులకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలుస్తున్నది. ఇప్పటికే పలు సంఘాలకు భవనాలు నిర్మిస్తూనే పథకాలు అమలు చేస్తుండగా.. తాజాగా రజక, నాయీ బ్రాహ్మణులకు తీపి కబురు అందించింది. క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నది. రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోగా ఆయా వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందజేసేలా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సర్కారు జీవో జారీ చేయగా.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,380 సెలూన్లు, 1,500 లాండ్రీ దుకాణాలు, 86 ధోబీఘాట్లు ఉన్నాయి. ప్రతి ఇస్త్రీ దుకాణానికి నెలకు రూ.800 నుంచి రూ.1000 వరకు, సెలూన్ దుకాణానికి నెలకు రూ. 500 వరకు కరెంటు బిల్లు వస్తున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కరెంటు ఫ్రీగా అందనుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యా ప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు, రజకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఏ సర్కారూ మమ్మల్ని పట్టించుకోలేదు..
50 ఏండ్లుగా రజక వృత్తిని చేసి జీవనం గడుపుతున్నా. ఈ వృత్తిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించి కొడుకులను చదివించా. గతంలో ఏ ప్రభుత్వం ధోబీఘాట్లను నిర్మించలేదు. రజకులను వృత్తిపరంగా ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మా కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్.. 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన హామీని ఈ సర్కారు నిలబెట్టుకుంటుంది. అది ఈ హామీ నెరవేర్చడంతో నిజమైంది.
సీఎం సారుకు రుణపడి ఉంటం..
మంచిర్యాల అర్బన్: కులవృత్తిని నమ్ముకున్న నాకు సీఎం కేసీఆర్ సారు నిర్ణయం ఎంతో మేలు చేస్తున్నది. మంచిర్యాల వంటి పట్టణాల్లో కస్టమర్లందరూ మిషన్లనే వాడాలని అడుగుతుం టరు. కటింగ్, షేవింగ్లకు ట్రిమ్మింగ్ మిషన్ తప్పనిసరైంది. దీంతో కరెంట్ బిల్లు కూడా బాగా వస్తున్నది. కిరాయి, కరెంటు, ఖర్చులు పోనూ మిగిలేది నాకు అంతంతే. బాగా ఇబ్బందవుతుండే. ఇప్పుడు ఆ రంది తీరింది. కరెంటు ఫ్రీగా ఇస్తమని ముఖ్యమంత్రి సారు చెప్పిడు. దీంతో కొంత ఆదాయం మిగిలే అవకాశం ఉన్నది. నాకైతే బాగా సంబుర మనిపిస్తున్నది. సీఎం సారుకు కచ్చితంగా రుణపడి ఉంట.
సీఎంపై నమ్మకంతోనే మీటరు పెట్టించుకున్న..
నిర్మల్ అర్బన్ : నేను 20 ఏండ్లుగా క్షౌరవృత్తి చేస్తున్నా.. ఇటీవల సీఎం కేసీఆర్ సార్ సెలూన్లు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్ను అందిస్తాననడంతో కొత్తగా మీటర్కు ఐప్లె చేశా. ఇచ్చిన హామీని అమలు చేసే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీతో పాటు ఇవ్వని హామీలను ఎన్నో నెరవేర్చారు. ఉచిత కరెంట్తో మా కష్టాలకు ఇప్పుడు గుర్తింపు రానుంది.
ఇవి కూడా చదవండి
ఆద మరిస్తే అంతే.. తస్మాత్ జాగ్రత్త..
అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి
ఆన్లైన్ ట్రేడింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్టు
పాలకుర్తి, వల్మిడి దేవాలయాల అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష