డ్యూటీలో ఉన్న తల్లికి మమ్మీ తొందరగా ఇంటికి రా.. అంటూ ఫోన్ చేసిన కుమారుడు.. తల్లి ఇంటికి వచ్చే సరికి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సంఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాల్వేరు మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర బీదర్కు చెందిన అశోక్, విజయమేరీ దంపతులు తన పెద్ద కుమారుడు ఆశీర్వాదం(15)తో పాటు 11ఏండ్ల కుమార్తెతో గత మూడు నెలల కిందట ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి గోల్నాక శాంతినగర్లో నివాసముంటున్నారు. భర్త అశోక్ పని దొరకక పోవడంతో ఖాళీగా ఉంటుండగా అతడి భార్య విజయమేరీ కోఠిలోని ఓ ఆటోమొబైల్ షాపులో పనిచేస్తున్నది. కాగా ఈ నెల 3వ తేదీన సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడు ఆశీర్వాదం సాయంత్రం 7గంటలకు మమ్మీ త్వరగా ఇంటికి రా అంటూ డ్యూటీలో ఉన్న తల్లికి ఫోన్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన తల్లి విజయమేరీ సాయంత్రం 8గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఎంతకూ కుమారుడు తలుపులు తీయక పోవడంతో ఇంటి యజమాని, స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి చూడగా బాలుడు మృతిచెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.