సూర్యాపేట, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో పెను మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సాగు పద్ధతులపై సలహాలు సూచనలు అందించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదికను నిర్మించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రైతువేదికల భవనాలు పూర్తి కాగా వాటికి అవసరమైన ఫర్నీచర్ కూడా ప్రభుత్వం సమకూరుస్తున్నది.
ఒక్కో వేదికకు రూ.1.38 లక్షల ఫర్నిచర్
సూర్యాపేటలో 82, నల్లగొండలో 140 రైతు వేదిక భవనాలు పూర్తయ్యాయి. ఒక్కో భవనానికి రూ.1,38,695 విలువైన ఫర్నిచర్ను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రతి కార్యాలయానికి ఒక అల్మారా, రెండు ఆఫీస్ టేబుళ్లు, ఎనిమిది ఎస్-టైప్ కుర్చీలు, రెండు ఎగ్జిక్యూటివ్ కుర్చీలతో పాటు 125 ప్లాస్టిక్ కుర్చీలు, ఒక మైక్ సెట్ అంది స్తున్నది. వీటిలో ప్లాస్టిక్ కుర్చీలు, మైక్ సెట్ మాత్రం ఆన్లైన్ టెండర్ ద్వారా ఆయా జిల్లాల్లోనే కొనుగోలు చేయనుండగా మిగిలినవన్నీ జైళ్లశాఖ ఆధ్వర్యంలో తయారైన వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉమ్మడి జిల్లాలోని రైతు వేదిక భవనాలకు పంపుతున్నది.
సాగు చర్చలకు అనుకూలం
రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండనుండగా రైతులు అక్కడే సాగు సంబంధిత చర్చలు చేసుకునేందుకు వీలుంది. రానున్న రోజుల్లో కార్యాలయాలను కూడా డిజిటలైజ్ చేసి వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులపై రైతులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గ్రామ క్లస్టర్లలో రైతు వేదిక భవనాల నిర్మాణం, ఫర్నిచర్ సమకూర్చడం పట్ల గ్రామీణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గాలి ద్వారా కరోనా.. బలమైన ఆధారాలు ఉన్నాయన్న లాన్సెట్