న్యూఢిల్లీ: నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడమే తమ ప్రధాన ఎజెండా అని ఢిల్లీ నూతన మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. ఇవాళ ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి ఆమె మీడియాతో మాట్లాడారు. మా కోర్ కమిటీ త్వరలోనే ఢిల్లీలోని చెత్త డంపింగ్ ప్రాంతాలను పరిశీలించి, నగరంలో చెత్త సమస్య పరిష్కారానికి మార్గాలు చూపుతుందని ఆమె చెప్పారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ చట్టానికి అనుగుణంగా తాను తన విధులు నిర్వహిస్తామని షెల్లీ ఒబెరాయ్ తెలిపారు. ఎంసీడీ ఎన్నికల సందర్భంగా మా ముఖ్యమంత్రి 10 హామీలు ఇచ్చారని, ఆ హామీలన్నీ నెరవేర్చేందుకు తాము కృషిచేస్తామని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగిందని, డిప్యూటీ మేయర్ ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఇన్వాలీడ్ ఓటింగ్ను గమనించానని, ఇప్పుడు దానిపై కామెంట్ చేయదల్చుకోలేదని షెల్లీ పేర్కొన్నారు.
కాగా, గత నెల 6న జరగాల్సిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడి, ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు పూర్తయింది. ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎంపీల ఓట్లతో కలిసి మొత్తం 266 ఓట్లకుగాను ఆప్ అభ్యర్థి షెల్లీకి 150 ఓట్లు పోలయ్యాయి. ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇవి కూడా చదవండి..