Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ వరకూ దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఈశాన్య భారతదేశంలో రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చని పేర్కొంది. సెప్టెంబరు 12 నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో భారీ వర్షం కురిసింది. 12 గంటల వ్యవధిలోనే అత్యధికంగా 90 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమై వర్షం సోమవారం ఉదయం వరకూ కొనసాగింది. ఈ వర్షానికి పలు ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మంగళవారం వరకూ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటావా, ఔరైయా, గొండా, కన్నౌజ్, అయోధ్య సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు లక్నోలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 12వ తేదీ వరకు సెలవు ప్రకటించారు.
మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని డెహ్రాడూన్, నైనిటల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో సెప్టెంబర్ 13న భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తెహ్రీ, బాగేశ్వర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతోపాటు ఇళ్లు కూలిపోయాయి.
మరోవైపు రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒడిశాలో 14, 15 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా తూర్పు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో సెప్టెంబర్ 11-15 తేదీల మధ్య వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read..
Sudan Crisis | సుడాన్లో ఆగని ఆధిపత్య పోరు.. తాజా డ్రోన్ దాడిలో 43 మంది మృతి
Rishi Sunak | బంగ్లాదేశ్ ప్రధానితో రిషి సునాక్ హార్ట్ టచ్చింగ్ మూమెంట్.. ఫొటో వైరల్